వెయ్యికి 10 అంటూ ఆఫర్... కరోనాను కూడా లెక్కచేయకుండా దూసుకొచ్చిన జనాలు!

  • చెన్నై బీసెంట్ నగర్ లో కొత్త వస్త్రదుకాణం
  • ఓపెనింగ్ సందర్భంగా బంపర్ ఆఫర్
  • రెండు కిలోమీటర్ల మేర జనాలతో నిండిపోయిన రోడ్డు
సాధారణంగా వన్ ప్లస్ వన్ ఆఫర్లకు బాగా అలవాటు పడిన జనాలు వెయ్యికి 10 అంటే పోటెత్తడం ఖాయం. చెన్నైలో అదే జరిగింది. మురుగేశన్ అనే వ్యాపారి చెన్నైలో బాగా జనసమ్మర్దం ఉండే బీసెంట్ నగర్ లో కొత్త వస్త్ర దుకాణం ప్రారంభించాడు. దాంతో ప్రజలను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. రూ.1000లకు 10 బ్రాండెడ్ టీషర్టులు లేదా జీన్స్ ప్యాంట్లు అంటూ ఊరించాడు. ఓవైపు ఇది కరోనా కాలం. అయినా గానీ జనాలు లెక్కచేయకుండా బీసెంట్ నగర్ లోని మురుగేశన్ వస్త్రదుకాణాన్ని వెతుక్కుంటూ వచ్చారు.

బంపర్ ఆఫర్ బాగా పనిచేయడంతో భారీ సంఖ్యలో జనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఈ షాపుకు వచ్చిన జనాలతో అక్కడి రోడ్డు వద్ద దాదాపు రెండు కిలోమీటర్ల మేర తీవ్ర రద్దీ ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న అధికారులు వెంటనే బీసెంట్ నగర్ చేరుకుని, ఆ బట్టల దుకాణం ముందు హంగామా చూసి ఆశ్చర్యపోయారు.

భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సిన ఈ సమయంలో, అత్యంత ప్రమాదకర స్థితిలో జనం గుమికూడడాన్ని చూసి నివ్వెరపోయారు. అనుమతి లేకుండా ఇదేంటని ప్రశ్నిస్తూ దుకాణదారు మురుగేశన్ పై కేసు నమోదు చేసి, దుకాణాన్ని మూసివేశారు.

Crowd
Textile Shop
Bumper Offer
Besant Nagar
Chennai
Corona Virus

More Telugu News